సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: :పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తయిన ఆనందంలో సరదాగా స్నానానికి వెళ్లిన 5గురు విద్యార్థులలో ఇద్దరిని గోదావరి లో ఉన్న ఊబి ప్రాణాలు హరించింది. తోటి విద్యార్థులు చూస్తుండగానే వారు మునిగిపోయారు. ఈ విషాద ఘటన గత మంగళవారం రాత్రి ఆచంట మండలం భీమలాపురం వద్ద చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరుకు చెందిన కామిశెట్టి గిరిధర్ , కొండేపూడి భాను ప్రసాద్ , ఉందుర్తి యుగంధర్, కె.కార్తీక్, కేతా సైమర్ వీరు ఐదుగురు పక్కనే ఉన్న భీమలాపురం గోదావరికి సరదాగా స్నానం చేసేందుకు గత సాయంత్రం సమయంలో వెళ్లారు. గోదావరిలో రెండు పాయలు ఉండటంతో మొదటి పాయలో నడిచి రెండవ పాయలో స్నానం చేస్తుండగా కొండేపూడి భాను ప్రసాద్ (15) కామిశెట్టి గిరిధర్ (15) ఇద్దరు ఊబిలో పడి గల్లంతయ్యారు. మిగతా ముగ్గురు విద్యార్థులు కేకలు వెయ్యడంతో స్థానికులు స్పందించి వెంటనే గల్లంతైన విద్యార్థుల కోసం నాటు పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రాత్రి 7 గంటలకు గల్లంతైన ఇద్దరు విగత జీవులుగా దొరికారు. వారిని చూసి బంధువులు, విద్యార్థులు కన్నీరు కావడంతో విషాదం ఆవరించింది.
