సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై దేశంలో ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ ర్యాంకింగ్ కొలమానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరీక్షలో ఏ ఇద్దరు విద్యార్థులకైనా ఒకే స్కోర్ వస్తే.. అలాంటి సందర్భాల్లో ర్యాంకు కేటాయించేందుకు గతంలో తొమ్మిది కొలమానాలు ఉండేవి. అయితే వాటిని తాజాగా ఏడింటికి కుదించారు. అంటే ఈ ఏడు కొలమానాల ద్వారా మాత్రమే అంతిమ స్కోర్ని నిర్ణయిస్తారన్నమాట. అప్పుడు ఒకే ర్యాంకు వచ్చిన ఇద్దరికీ వేరువేరు ర్యాంకు కేటాయిస్తారు. ర్యాంకు కొలమానమైన వయసు, హాల్టికెట్ సంఖ్యను ఈ ఏడాది నుంచి పరిగణనలోకి తీసుకోకుండా తొలగించారు. ఈ మేరకు ఎన్టీఏ ర్యాంకింగ్ కేటాయింపులో మార్పులు చేసింది.కాగా జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవగా.. నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనవరి 22 నుంచి 31వరకు జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జరుగుతాయి. గత ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాశారు. ఈ సారి కూడా పోటీ తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
