సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ (CPS)ను అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం స్పందన రావటం లేదని ఆరోపిస్తూ ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. అందుకు నిరసనగా ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఈ నెల 9 నుంచి ఏప్రిల్ 3 వరకు దశల వారీగా ఉద్యమం చేస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 5న జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.తమ ఉద్యమానికి ఏపీ సీపీఎస్ఏ కూడా మద్దతు ప్రకటించిందన్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
