సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో 96 ఎంపీ స్థానాల కోసం 2024 లోక్సభ నాలుగో దశ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 ఎంపీ సీట్లకు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అయితే అసలు ఓటు ఎలా వేయాలి, ఓటు వేసిన తర్వాత శబ్దం రాకపోతే(beep sound) ఏం చేయాలనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మీరు ముందుగా మీ IDతో పోలింగ్ స్టేషన్లోని ఓటింగ్ బూత్ను చేరుకొని అక్కడ లైన్లో నిలబడండి. దీని తర్వాత పోలింగ్ అధికారి ఓటరు జాబితాలో మీ పేరు, మీ గుర్తింపు రుజువును తనిఖీ చేస్తారు.వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్స్ కూడా అక్కడ ఉండి మీ ఓట్లు ద్రువీకరించుకొంటారు. ఆ తర్వాత పోలింగ్ అధికారి మీ వేలి గోరుపై చెరగని సిరాతో గుర్తుపెట్టి, స్లిప్ ఇచ్చి మీ సంతకాన్ని తీసుకుంటారు.మీరు ఆ స్లిప్ను మూడవ పోలింగ్ సిబ్బందికి సమర్పించి, ఆ తర్వాత మీరు పోలింగ్ బూత్కు వెళ్లాలి. అప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లో మీకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు బ్యాలెట్ బటన్ను నొక్కడం ద్వారా మీ ఓటును నమోదు చేయవచ్చు. ‘అసెంబ్లీ కి ఎంపీ అభ్యర్ధికి రెండు వేరు వేరు మిషన్స్ లో’ ఓట్లు వెయ్యవలసి ఉంది. మీరు ఓటు వేయాలనుకున్న అభ్యర్థి ముందు ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి, అప్పుడు ఎంచుకున్న అభ్యర్థి పేరు ముందు రెడ్ లైట్ వెలుగుతుంది. ఆ క్రమంలో కంట్రోల్ యూనిట్ నుంచి బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు మీ ఓటు విజయవంతంగా వేయబడిందని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ మీరు ఓటు వేసిన తర్వాత VVPATలో మీకు ఓటింగ్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ సౌండ్ రాకున్నా అక్కడే ఉన్న ప్రిసైడింగ్ అధికారిని అడగాలి. ఓటు వేసిన క్రమంలో VVPAT మెషీన్ పారదర్శక విండోలో కనిపించే స్లిప్ను కూడా తనిఖీ చేసుకోవచ్చును. అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తుతో కూడిన ఈ స్లిప్ 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత అది సీలు చేసిన VVPAT బాక్స్లో పడిపోతుంది.మీరు ఏ అభ్యర్థికి కూడా ఓటు వేయడం ఇష్టం లేకపోతే మీరు NOTA (పైన ఉన్న వాటిలో ఏదీ కాదు)పై కూడా నొక్కవచ్చును.
