సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వాతావరణ శాఖ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తదుపరి రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని వెల్లడించారు.ఆవర్తనం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో మంగళ, బుధ,గురువారాల్లో(12,13,14 తేదీల్లో) రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
