సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా.. ఏపీ సచివాలయంలో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దటం, ప్రమాదాలను నివారించేలా క్రాష్ బారియర్లు, డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందటం , రహదారి ప్రమాదాల్లో మన ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉండటంపై ఆందోళనకరమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారులు వివరణ ఇస్తూ .. అయితే ఇందులో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవేనని, వాస్తవానికి వాహనదారులు ఓవర్ స్పీడ్ కారణంగా 79 శాతం మేర, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 3 శాతం, మద్యం, మొబైల్ ఫోన్ల కారణంగా 1 శాతం చొప్పున ప్రమాదాలు జరుగుతున్నట్టు వివరించారు. నెల్లూరు, తిరుపతి, పలనాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉండటంపై కారణాలు ఆరా తీయాలని సీఎం అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రహదారులపై ఇరువైపుల ప్రతీ అర కిలోమీటరు పరిధిని కవర్ చేసేలా మూడు నెలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని , అధికారులు .హెచ్చరికలు జారీ చేసినా అమిత వేగంగా ప్రయాణించే వాహనాలను వెంటనే సీజ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
