సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏలూరు జిల్లాలో సంచలనం కలిగించిన కేసులో భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ జైలులోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు జిల్లా జైలులోని మహిళా బ్యారక్ లో గత ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళ్ళితే .. జీలుగుమిల్లి మండలం తాటాకుల గూడేనికి చెందిన గంధం బోసుబాబు పై ఈ నెల 17న రాత్రి దాడి జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బోసుబాబు చనిపోయాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బోసుబాబు హత్య కేసులో స్వయంగా ఆయన భార్య శాంతకుమారి, ఆమె ప్రియుడు సొంగా గోపాలరావు ఈ నేరానికి పాల్పడినట్లు అధికారులు విచారణలో భావించి వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు..ఇద్దరిని జిల్లా జైలుకు తరలించారు. శాంతకుమారిని మహిళా బ్యారక్ లో ఉంచారు. జిల్లా జైలులోని మహిళా బ్యారక్ ను 30 మంది ఖైదీలు ఉండేలా ఏర్పాటు చేశారు. గత ఆదివారం ఉదయం బ్యారెక్ తెరిచారు.శాంతకుమారి బాత్ రూమ్ కి వెళ్లి వస్తానని మిగిలిన ఖైదీలకు చెప్పి బ్యారక్ లోకి వెళ్లింది. టిఫిన్ తినేందుకు ఎంతసేపటికీ రాకపోవడంతో వారు వెళ్లి చూడగా బ్యారక్ కిటికీ వద్ద చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొన్నట్లు కనిపించింది. జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. మా కుమార్తెను భర్త కేసులో దారుణంగా ఇరికించారని మృతురాలి తల్లి బత్తుల కుమారి,కుటుంబ సభ్యులు ఆరోపించారు.పోలీసులు ఒత్తిడి చేసి బెదిరించడం వల్లే నేరం చేసినట్లు అంగీకరించిందని ,చేయనితప్పుకు అవమానంతో ఇప్పుడు అఘాయిత్యానికి పాల్పడటంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని విలపిస్తున్నారు. మహిళా బ్యారక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్ వరలక్ష్మీ, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేసారు.
