సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ఏపీలో భారీ అదనపు చార్జీలతో కరెంట్ బిల్లులు ఎక్కువ వసూళ్లు జరగటం ఫై ప్రజలు బెంబేలు పడిపోతున్నారని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు విమర్శించారు. ఈ సందర్బంగా నేడు, ఆదివారం, అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణకు నాలుగేళ్లుగా నిధులు కేటాయించలేదని, రాష్ట్రంలో కరెంటు కోతలు లేని గ్రామం, నగరం గానీ లేదని అన్నారు. ప్రజలకు వస్తున్నా కరెంట్ బిల్లులు కూడా గజదొంగలు సైతం విస్తుపోయేలా ప్రజలను జగన్ దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్ ఈ నాలుగేళ్లలోనే 8 సార్లు ఛార్జీలు పెంచి రూ.57 వేల కోట్లకు పైగా ప్రజలపై భారం మోపారని, విద్యుత్ ఛార్జీలు 4 రెట్లు పెరిగాయన్నారు. కొత్త కొత్త రూపాలలో, మోసపూరిత పద్ధతుల్లో భారం వేస్తున్నారన్నారు. ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, విద్యుత్ సుంకాలు ట్రూ అప్, సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజల నడ్డివిరుస్తున్నారని, అసలు కరెంట్ వాడని ఖాళీ పోర్షన్ కుటుంబాలవారికి కూడా ఉత్తిపుణ్యానికి 160 రూపాయలు పైగా బిల్లు వేస్తున్నారని, అదనపు లోడ్ పేరుతో డెవలప్మెంట్ చార్జీలంటూ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని, రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం బిల్లులో 50 శాతం ట్రూ అప్ భారాలు ఉండటం ప్రభుత్వం దోపిడీకి నిదర్శనం కాదా?.. అంటూ కళావెంకట్రావు ప్రశ్నించారు.
