సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కాకినాడలో నేడు, గురువారం ఆకస్మికంగా విషవాయువుల వెలువడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ రోజు ఉదయం పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే సమయం గడుస్తున్నప్పటికీ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు బయటకు రాకపోవడంతో మిగిలిన కార్మికులు వెళ్లి చూడగా అందరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే ట్యాంకర్ను అప్పటికప్పుడు యంత్రాలతో కూల్చి అందరినీ బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
