సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం/నరసాపురం: నరసాపురం పట్టణ ప్రజల దశాబ్దాల కల అయిన NH-216 బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. తాజగా సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వ్యక్తిగత అభ్యంతరాల కంటే మెజారిటీ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బైపాస్ పనులపై గతంలో ఒక భూయజమాని దాఖలు చేసిన పిటిషన్ను గౌరవ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొత్తం 22.17 కిలోమీటర్ల పొడవున్న ఈ బైపాస్ రోడ్డులో ఇప్పటికే 96% భూసేకరణ పూర్తయ్యింది. కేవలం 750 మీటర్ల (3.38%) భూమికి సంబంధించి మాత్రమే గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023లో టెండర్లు పిలవగా, ల్యాండ్ ఓనర్ కోర్టును ఆశ్రయించారు. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా స్థానిక ఎంపీ,కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. ఆయన ఢిల్లీలో NHAI అధికారులు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) ఐశ్వర్యా భాటి తోపాటు సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమై అందరినీ సమన్వయం చేశారు. దీంతో మంత్రి చొరవతో కేసు త్వరగా విచారణకు పూర్తి చేసుకొని గత మంగళవారం సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో నరసాపురం బైపాస్ రోడ్డు పనులు తిరిగి ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హర్షం ప్రకటించారు.
