సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాబోయే కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కేరళంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంగమాలి , కొడంగల్లూర్ లలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన కీలక సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ఇటీవల కీలకమైన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ద్వారా కేరళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వారు బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ చారిత్రక విజయం కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడానికి పునాది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.త్వరలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళంలో పర్యటించనున్నారని, ఆయా ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేరళంలోని ప్రభుత్వాలు మోదీ అభివృద్ధి ఫలాలను సామాన్య ప్రజలకు చేరనివ్వకుండా అడ్డుకుంటున్నాయి అని విమర్శించారు బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కేరళంలో “కమలం” వికసించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
