సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కోళ్ల ను పెంచే పౌల్ర్టీ రంగం ఇటీవల కోళ్లకు అంతుచిక్కని వ్యాధులతో తీవ్ర నష్టాలలోకి సంక్షోభంలోకి వెళ్ళిపోతుందని గత ప్రభుత్వం తెచ్చిన పౌల్ర్టీ పాలసీని పునఃసమీక్షించి, రాష్ట్రంలో పౌల్ర్టీ రంగాన్నిమరల పునర్జీవింపచేయాలని ఏపీ పౌల్ర్టీ ఫెడరేషన్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును పౌల్ర్టీ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.సుబ్బారావు, ఉపాధ్యక్షుడు టి.కుటుంబరావు, సహాయ కార్యదర్శి పి.సుబ్బారెడ్డి, సభ్యులు కలిశారు. రాష్ట్రంలో లేయర్ పౌల్ర్టీ ఫార్మర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, ఇటీవల గోదావరి జిల్లాలలో లక్షలాదిగా కోళ్లు చనిపోతున్నాయని అక్కడ సంక్షోభంలో ఉన్న పౌల్ర్టీ రంగానికి చేయూత అందించాలని, ప్రతి జిల్లాలో కోళ్ల వ్యాధుల నిర్ధారణ, నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.అలాగే రాష్ట్రంలో కోళ్ల దాణాకు వినియోగించే మొక్కజొన్నపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయించేలా కేంద్రానికి లేఖ రాయాలని, మార్కెట్లో కోడిగుడ్ల ధరలను తారుమారు చేసే విధానాలను నియంత్రించడానికి పౌల్ర్టీ రైతులు, గుడ్డు వ్యాపారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, 2018-19లో పౌల్ర్టీ రైతులకు అప్పటి మీ హయాంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.45.65 కోట్ల రాయితీ నిధులు విడుదల చేయాలని, రుణాలను ఏడాదిపాటు రీషెడ్యూల్ చేయాలని, సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.
