సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి వాయుగుండం అండమాన్ వద్ద పోర్ట్బ్లెయిర్కి 440 కిలోమీటర్లు.. విశాఖపట్నానికి 970 కిలోమీటర్లు.. చెన్నైకి 970 కిలోమీటర్లు, కాకినాడకి 990 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 1040 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయిందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ, రేపటి (ఆదివారం) కి తీవ్ర వాయుగుండంగా.. ఎల్లుండి(సోమవారం) ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయానికి మరింత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఏపీలోని మచిలీపట్నం – కళింగపట్నం మధ్య గోదావరి జిల్లాల మీదుగా కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
