సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న పేరు.. చెడ్డీ గ్యాంగ్ …ఈ దొంగల బాచ్ పేరువింటేనే ఏదో తెలియని వణుకు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్యాంగులు నేరాలకు పాల్పడని జిల్లాలు లేవంటే అతిశయోక్తి కాదు. కొంతకాలంగా ఈ గ్యాంగ్ కదలికలు కనిపించకపోయినా ఇటీవల కాలంలో తిరుపతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు అధికారులు అన్ని జిల్లాల్లోనూ జల్లెడ పడుతూ. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇటీవల రాజమహేంద్రవరంతో పాటు, ఉభయ గోదావరి జిల్లాలలో ఇప్పటికే ప్రవేశించిందా? అన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి గస్తీ పెంచారు. చెడ్డీ గ్యాంగ్ నేరాలు చేసే విధానం విలక్షణంగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 8 మంది వరుకు సభ్యులుగా ముఠాగా కలసి వీరు నేరాలకు నగరానికి దూరంగా ఉన్న ఇళ్లనే దొంగతనానికి ఎంపిక చేస్తారు.మూకుమ్మడిగా దాడి చేస్తారు. ముఖ్యంగా రైల్వేట్రాకుల వెంబడి ఉన్న ఇళ్లు, జాతీయ రహదారికి దగ్గరగా ఒంటరిగా ఉన్న బంగ్లాలు, భవనాలు, అపార్టుమెంట్లు వీరు తమ దొంగతనాలకు అనుకూలంగా భావిస్తారు. దొంగతనానికి పాల్పడేందుకు వెళ్లే సమయంలో కత్తులు, చాకులు తమ వద్ద ఉంచుకుంటారు. రాత్రి 2 గంటల నుంచి 3 గంటల లోపు సమయాన్ని వీరు నేరాలకు అనువైనదిగా ఎంచుకుంటారు. ఎక్కువ సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లను సైతం వీరు తమ లక్ష్యంగా ఎంచుకుంటున్నారంటే వీరిలో ఉన్న బరి తెగింపే కారణం.నిమిషాల వ్యవధిలోనే నేరం చేసి అక్కడ నుంచి సులువుగా బయటకు వచ్చి రైల్వే ట్రాకు వద్దకు చేరుకుని వేగంగా వెళుతున్న రైలును లేదా జాతీయ రోడ్లపై వచ్చే లారీలను కూడా వీరు సులువుగా ఎక్కి పరారౌతారు.
