సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అనారోగ్యానికి గురైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోలుకొని రేపటి ఆదివారం నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావిస్తున్నారు. అయితే తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట నివాసముండేందుకు ఇల్లు చూసుకుంటాఅని గతంలో ప్రకటించిన నేపథ్యంలో తాజగా ఒక భూస్వామి తన పొలాల్లో నిర్మించిన కొత్త ఇంటిని ఎంపిక చేసుకున్నారు. ఈ కొత్త ఇంటిలోనే ఈనెల 9వ తేదీన పవన్ గృహప్రవేశం చేసి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంటపొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనాన్ని పవన్ నివాసముండేందుకు ప్రాథమికంగా ఎంపిక చేసుకొన్నారు. జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునేవరకూ ఇక్కడే ఉంటారు. ఈ ఇంటికి గత శుక్రవారం గృహప్రవేశం కూడా పూర్తయింది. గ్రౌండ్ఫ్లోర్ను పూర్తిగా వాహనాల పార్కింగ్కు, మొదటి ఫ్లోర్లో ఆఫీసు నిర్వహణకు, రెండు, మూడు అంతస్తులు కలిపి డూప్లెక్సు తరహాలో నిర్మించారు. పవన్కు అనువుగా ఉంటుందని భావించిన పార్టీ నేతలు దీనిని ఎంపిక చేశారు. ఓదూరి నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో ఇంటిని ఒక్క రూపాయి మాత్రమే తీసుకోని అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇంటికి సమీపంలోనే పంటపొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు పనులు ప్రారంభించారు.
