సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో నేడు, సోమవారం సమావేశాల్లో 8వ రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రఘురామా కృష్ణంరాజు స్పీకర్ స్థానంలో ఉండగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థ, నిరుద్యోగుల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. విశేషమేమిటంటే, ఈ జాబ్ క్యాలెండర్లోనే డీఎస్సీ(DSC) పోస్టులను కూడా చేర్చనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(KGBV) పనితీరుపై , ఉపాధ్యాయుల జీతాల పెంపు ఫై ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిస్తూ.. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో కేజీబీవీలకు ఎక్కువ డిమాండ్ ఉందని, అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపారు. జీతాల పెంపుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని, కేంద్రం సహకారం అందిస్తే మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
