సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధను ర్మాసం రేపు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసంలో ప్రాతఃకాలం ఎంతో పవిత్ర మైనది. సూర్యుడు ధనస్సు నుంచి మకరరాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి పండుగ రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెలరోజులు వైష్ణవ ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలోని అన్ని ప్రముఖ వైష్ణవ దేవాలయాలు, జీయర్ స్వామి వైష్ణవ మఠంలతో పాటు భీమవరం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయం భువుడుగా వెలసిన కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఇంకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో చిన్నతిరుమలగా ప్రసిద్ధి పొందిన .. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి మారుగా తిరుప్పావైను పఠిస్తారు. ప్రతి రోజు శ్రీవారికి దేవేరులతో ప్రత్యేకపూజలు పల్లకి సేవలు ఉంటాయి. ఈ మాసంలో ఇంటి ఆవరణలో మహిళలు చక్కటి ముగ్గులు పెట్టి ఉభయ సంధ్యలలోదీపారాధన చేయడం వల్ల, తెల్లవారుజాము బ్రహ్మముహూర్తంలో తిరుప్పావై పారాయణ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధ్దిస్తాయని పండితులు చెబుతున్నారు. శ్రీరంగనాథుడు గోదాదేవిని పరిణయమాడతారు. గోదాకల్యాణం శ్రీవారి క్షేత్రంలో భోగి పండుగరోజున స్వామి, అమ్మవార్ల కల్యాణంతో కలసి నిర్వహిస్తారు.
