సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మొంథా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేసిందని, తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నేడు, మంగళవారం నరసాపురం నియోజకవర్గంలోని పేరుపాలెం, కేపీ పాలెం పెద్దమైనవానిలంకలోని గ్రామాలలో పర్యటించి పునరావాస కేంద్రాలను సందర్శించారు. సముద్రపు కోతకి గురవుతున్న పెద్దమైనవానిలంక తీర ప్రాంతాన్ని పరిశీలించారు. సముద్రపు కోత నివారణకు జరుగుతున్న అడ్డుకట్ట పనుల పురోగతిని నరసాపురం ఆర్డీవో దాసిరాజును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాసకేంద్రాల్లో వసతి సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీరప్రాంత గ్రామాలలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ గొట్టిపాటి రవికుమార్, నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.
