సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం నుండి మద్యాహ్నం 12 గంటల వరకు భీమవరం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశం మేఘ వృత్తం అయ్యింది. చల్లని గాలులు వీచాయి. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా భానుడు ఎర్రని ఎండలతో విజృంభించాడు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నేడు, సోమవారం ఉరుములు, మెరుపులతో, పిడుగులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి తిరుపతి జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షంతో పాటూ గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
