సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని డీఆర్వో కె.కృష్ణవేణి ఆదేశాలు జారీచేశారు. రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి, కన్వీనర్ కె. చంద్రశేఖర్బాబు, భీమవరం మునిసిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ లతో పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలి. జిల్లా వ్యాప్తంగా అన్ ఎయిడెడ్ కళాశాలలు 39, ప్రభుత్వ కళాశాలలు 10, ఎయిడెడ్ కళాశాలలు 3, మొత్తం కలపి 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మొత్తం 34,642 మంది విద్యార్థులు హాజరవు తారన్నారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు వహించాలని విద్యుత్శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను, పరీక్షా కేంద్రాల వద్ద పారిశుధ్య నిర్వహణ, మౌలిక సౌకర్యాలు కల్పించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు.
