సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ వైపు వెళ్లే వాహనదారులకు చించినాడ వంతెనపై నుండి వెళ్లినందుకు పడుతున్న ఇబ్బందులకు తోడు… పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై జాయింట్లు వద్ద మరమ్మతుల నిమిత్తం గత మంగళవారం నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నయంగా ఏర్పాటు చేసిన మార్గంలో (పాత అక్విడెక్టుపై నుంచి రాక పోకలు సాగిస్తున్నారు. అయితే బస్సులు, భారీ వాహనాల రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులపై రాకపోకలు సాగించే ప్రయాణికులు మాత్రం అక్విడెక్టు అవతల నుంచి ఇవతలకు కాళినడకన రాకపోకలు సాగిస్తున్నారు. అమలాపురం, రాజోలు వైపు వెళ్లే స్కూలు బస్సులు సైతం నిలిపివేయడంతో విద్యార్థులు సైతం బ్రిడ్జిపై నుంచి నడుచుకుని అవతల వైపునకు వెళ్తున్నారు. కాగా పాత అక్వి డెక్టుపై ఉన్న రైలింగ్లు కొంత భాగం సినిమా షుటింగ్ నిమత్తం తీసివేయడంతో వాహన రాకపోకల నిమిత్తం తాత్కాలికంగా ఇనుప రైలింగ్ను ఏర్పాటు చేశారు. కాగా 40 రోజుల పాటు అక్విడెక్టుపై పనులు నిర్వహణ కారణంగా భారీ వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను అనుసరించడానికి ప్రధాన సెంటర్లలో ఇరిగేషన్ అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. దీనితో అటువైపు RTC బస్సుల రాకపోకల్లో తాత్కాలికంగా మార్పులు చేసారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాజోలు నుంచి పి.గన్నవరం అక్విడెక్టు ఇవతల వైపు (లంకల గన్నవరం వద్ద) వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సు ఉంటుందని తెలిపారు. అలాగే పి.గన్నవరం సెంటర్ నుంచి రావులపాలెం, రాజమండ్రి వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సులు బయ లుదేరి వెళ్తాయని చెప్పారు.
