సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: నేడు,గురువారం స్వతంత్ర సమర యోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ సోదరులు భీమవరం పట్టణంలోని స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ లో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల త్యాగం మరువలేనిదని సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారిని ఎదిరించి, బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి దేశాన్ని విడిపించడానికి నాడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మి భాయి, కొమురం భీం వంటి వారు తమ ప్రాణాల్ని తృణ ప్రాయంగా అర్పించారన్నారు. నాడు దేశానికీ స్వాతంత్య్రం రావాలని, దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సంపద ప్రజలందరికీ చెందాలని, సామ్యవాదం రావాలని, నిరుద్యోగం పోవాలని, ప్రజలందరి సమస్యలు పోవాలని నాడు భగత్ సింగ్ కోరుకున్నాడన్నారు. భగత్ సింగ్ , అల్లూరి సీతారామరాజు వంటి వారి కలల్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య వాదులు, దోపిడీ దారులు ఈ దేశం విడిచి పోవాలని నాడు వారు ప్రాణ త్యాగం చేస్తే, నేడు అదే సామ్రాజ్య వాదులకు బీజేపీ ప్రభుత్వం ఎర్రతివాచి పరిచి దేశ ప్రజలకు చెడ్డ చేస్తుందని విమర్శించారు.
