సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో ప్రముఖ ముస్లీమ్ నేత జలాలుద్దీన్ బాబా ఆకస్మిక మరణం కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన పరిచయస్తులందరిని కలచివేసింది. వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనార్టీ సంఘ పెద్ద జలాలుద్దీన్ బాబా అనారోగ్యంతో మరణించారు. నేడు బుధవారం ఆయన భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సందర్శించి తీవ్ర దిగ్బ్రాంతి కి లోనయ్యారు. తమ కుటుంబంతో జలాలుద్దీన్ బాబా చిన్ననాటి నుండి కూడా కలిసిమెలిసి ఉండేవారని, కష్టసుఖాల్లో తన వెంటే అండగా ఉన్నారని, ఏనాడు కూడా పదవులను ఆశించలేదని, నిస్వార్ధంగా నాకోసం, పార్టీ కోసం బాబా పని చేశారని ఆయన అన్నారు. బాబా లేని లోటు తనకే కాదు పార్టీకి కూడా తీరని లోటని, బాబా భౌతికంగా మన ముందు లేనప్పటికీ, మన హృదయాల్లో మాత్రం ఆయన స్థానం పదిలంగా ఉంటుందని వెల్లడించారు. ముందుగా బాబా భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాబా కుటుంబానికి తాను అండగా ఉంటానని అన్నారు. వైసిపి పట్టణ కన్వీనర్ తోట భోగయ్య తదితర నేతలు బాబా భౌతిక దేహానికి నివాళ్లు అర్పించారు.
