సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, గురువారం శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా పురాతన తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ముందుగా కలశంతో శ్రీమావుళ్ళమ్మ దేవస్థానం వరకు ఉగాది లక్ష్మీ ఆశీర్వచనాలతో శోభయాత్ర నిర్వహించారు. తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక అని, సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు చిహ్నాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, , భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మన ప్రాచీన సంప్రదాయలు కనుమరుగు అయ్యాయని, నేడు ఈ వేదికపై ఆనాటి ప్రాచీన కళలైన జంగం దేవర, పిట్టల దొర, కొమ్మ దాసరి, బుర్రకథ, ఇంద్రజాలం, భారత నాట్యం తదితర ప్రదర్శనలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని, 40 ఏళ్లుగా ఈ వేడుకలను సంప్రదాయంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ..జాతి కులమత రహితంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని, 70 మందికి ఉగాది పురస్కారాలను అందించామని, వివిధ పోటీల్లో గెలుపొందిన 50 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించామని తెలిపారు. అనంతరం ప్రముఖ కవి తెన్నేటి లక్ష్మి నారాయణ రచించిన తెలుగు లోకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలోమెంటే పార్ధసారధి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
