సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా భీమవరం పరిధిలోని అన్ని శివాలయాలు ‘ ఓం శివోహం’ అంటూ భక్త సంద్రం తో నిండిపోయాయి. అందమైన పుష్ప అలంకరణలు తో కన్నుల కైలాసం తలపించే లైటింగ్ కాంతులతో, చలువ పందిళ్ళతో మెరిసిపోతున్న గునుపూడి పంచారామ క్షేత్రం లో చంద్ర ప్రతిష్ట శ్రీ సోమేశ్వరుని దర్శనం కోసం గత అర్ధరాత్రి నుండి భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి పోవడం జరిగింది. అయితే దర్శనాలు మాత్రం తెల్లవారు జాము 3 గంటలకు ప్రారంభించారు. దీనితో కొందరు భక్తులు అసహనం కు గురి అవ్వడం జరిగింది. నిజానికి ముందుగానే తెల్లవారు జాము 3 గంటలకే దర్శనాలు అని ప్రకటించినప్పటికీ (మన సిగ్మా న్యూస్ లో కూడా వేసాము) వేలాది గా భక్తులు తరలి రావడంతో తగిన పోలీసులు , స్వచ్చంద కార్యకర్తలు అందుబాటులో లేక కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. అయితే తెల్లవారు జాము 4 గంటలకు పరిస్థితి పూర్తీ అదుపులోకి వచ్చింది. శివరాత్రి కి భక్తులు కోసం దాతల సహకారంతో ప్రసాద వితరణ, మంచినీరు ఏర్పటు బాగుంది. నేటి ఉదయం 11 గంటల వరకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా వేగంగా భక్తులు శివదర్శనం చేసుకొంటున్నారు. పోలిసుల సహకారంతో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ కోడె విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యనిర్వాహణ అధికారి ఎం అరుణ్ కుమార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
