సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు,మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో పట్టణ అభివృద్ధి పై సమీక్ష జరిపారు. తదుపరి మీడియా తో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం భీమవరం పట్టణాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. గత నాలుగేళ్లుగా చూస్తే నా హయాంలో ఇప్పటివరకు భీమవరం పట్టణ అభివృద్ధికి సీఎం జగన్ సహకారంతో రూ 62 కోట్ల నిధులను ఖర్చు చేయడం జరిగిందని, ప్రతి వార్డులోను సిసి రోడ్ల నిర్మాణంతోపాటు డ్రైనేజీ నిర్మాణాలు కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. పట్టణంలో ఇంకా మరో ఏడు కోట్ల 17 లక్షల నిధులతో చేపట్టే పనులకు త్వరలోనే శ్రీకారం చుడతామన్నారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రతి వారం కూడా నివేదికలను అందించాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. చేపల మార్కెట్లో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదే మాదిరిగా ఏడవవార్డులోని లెప్రసికాలనీలో కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
