సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాకర ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకటైన భీమవరంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ యొక్క 5వ Graduation Day “విష్టోత్సవ 2k22” ను నేడు, శనివారం సీతా ఇండోర్ ఆడిటోరియం నందు వైభవంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 2018-22 బ్యాచ్ కు చెందిన 686 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, అలాగే 2020-22 బ్యాచ్ కు చెందిన 7 మంది ఎం.టెక్. విద్యార్థులు మరియు 53 మంది MBA విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్లను ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి, అర్థ స్కూల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సహ వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి అయినటువంటి, టి.ఎన్. హరి ముఖ్య అతిథిగా విచ్చేసారు. అలాగే శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, శ్రీ కె.వి. విష్ణు రాజు, మరియు వైస్ చైర్మన్ శ్రీ ఆర్ రవిచంద్రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి, టి.ఎన్. హరి మాట్లాడుతూ…విద్యార్థులు ఇప్పటి నుండే రాబోయే 10 సంవత్సరాల కాలానికి గాను ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని మరియు వేగంగా నేర్చుకోవడం ద్వారా వ్యవస్థాపకతపై చాలా ఆసక్తిని పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కె.వి. విష్ణురాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…కేవలం ఉద్యోగాలపైనే దృష్టి పెట్టకుండా మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగే ఉన్నత ఆలోచనలను కలిగి ఉండాలని సూచించారు. ప్రపంచం చాలా విస్తారమైనదై అనేక అవకాశాలను అందిస్తుందని, కనుక విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కోరారు.
