సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థులు విజయం సాధించారు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ లో విజయంకు కావలసిన ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లలో రెండు చోట్ల టీడీపీ విజయాలు సాధించగా పశ్చిమ రాయలసీమలో మాత్రం వైసీపీ, టీడీపీ పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి రౌండ్లోనూ తెదేపా, వైకాపా బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. అనంతపురం జేఎన్టీయూలో గత గురువారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు నేడు, శనివారం కూడా కొనసాగుతోంది. 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. మొత్తంగా 2,45,687 ఓట్లు పోలైనట్టు గుర్తించారు. వీటిలో 2,26,448 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. మొత్తం ఓట్లలో 19,239 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో.. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు. మొత్తానికి చాలా కాలం తరువాత (డిగ్రీ చదివిన) మెజారిటీ పట్టభద్రులు తెలుగు దేశం పార్టీ కి విజయాల రుచి చూపించారు.అధికార పార్టీకి ప్రతిపక్ష ఉనికి తెలిసేలా ప్రజా స్వామ్యంలో ఇది మంచిపరిణామంగానే భావించాలి,
