సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇకపై ప్రయాణికుల నుండి డిమాండ్ ఎక్కువగా ఉండే స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికి వెసులుబాటు కల్పిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న కోటా పరంగా కాకుండా ఆయా డిమాండ్ ఉన్న స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికి రిజర్వేషన్ కోటాను పెంచనుంది. ఈ విధానంలో.. ఏదైనా ఎక్స్ప్రెస్ రైలులో ప్రారంభ-గమ్యస్థాన స్టేషన్లను మినహాయిస్తే.. మధ్యలో ఉండే స్టేషన్లలో డిమాండ్ను అధికారులు గుర్తిస్తారు. ప్రారంభ స్టేషన్ నుంచి నేరుగా గమ్యస్థానానికి వెళ్లే ప్రయాణికుల కోటాను కొంత తగ్గించి, డిమాండ్ ఉన్న స్టేషన్లకు ఆ కోటాను కేటాయిస్తారు.ఈ మేరకు ‘ఆదర్శ రైలు ప్రొఫైల్’ పేరుతో పైలట్ ప్రాజక్టును ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే సహా.. దేశవ్యాప్తంగా ఏడు జోన్లలో 200 రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తే.. ఇదే విధానాన్ని మిగతా జోన్లు, రైళ్లలో దశల వారీగా అమలు చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
