సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి నదికి వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే వరదలకు చేపట్టాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళిక సమావేశాలు నిర్వహించారు. రానున్న మూడురోజుల్లో భద్రాచలం నుంచి గోదావరి వరద నీరు 9 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వచ్చే అవకాశం ఉందని, పెదవాగు, ఎద్దువాగుల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండ లాలకు వరద ముప్పు పొంచి ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 43అడుగులకు చేరుకోక ముందే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు రాకుండా అధికారులు సహాయ చర్యలకు సిద్ధం కావాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు కలుషితం కాకుండా తాగునీటి పైపులైన్లు, డ్రెయినేజీ పైపులైన్లు కలవకుండా చూడాలని, మరమ్మతులకు గురైన చేతి పంపులను వెంటనే మరమ్మతు చేయించాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత గ్రామల్లో అత్యవసర సమయంలో పంపిణీ చేసేందుకు 3నెలలకు సరిపడ నిత్యవసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కలెక్టర్లు ఆదేశించారు.
