సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత సోమవారం ఒరిస్సా లోని పూరి మీదుగా తీరాన్ని దాటింది. . నేడు మంగళవారం వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే క్రమంలో ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికి దాని ప్రభావం నేడు, మంగళవారం కూడా ఉత్తరాంద్ర లో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడ్డాయి. (అయితే గోదావరి జిల్లాలలో ఎండలు బాగా కాయడం గమనార్హం) గత 4 రోజులుగా భారీగా కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరైంది. అనేక వేల ఎకరాల పంటలు నాశనం అయ్యాయి. ఒడిశాలో భారీవర్షాలు కురవడంతో అటు నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ప్రవహించే సీలేరు శబరి నదులు, వాగులకు వరద పోటెత్తింది. అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తీవ్ర వాయుగుండం తీరం దాటినా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది.
