సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు వంటి 14 ఏళ్ళ సీఎంగా చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసి జైలులో ఉంచితే నా లాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని భయం వేస్తుందని ప్రకటించి ఇటీవల బాగా వైరల్ అయిన హీరో విశాల్ కు నిజంగా అరెస్ట్ భయంతోనే ఉన్నాడని ఇప్పుడు అర్ధం అయ్యింది. తనను తాను న్యాయస్థానాల కంటే గొప్ప వ్యక్తిగా విశాల్ భావించవద్దని, కోర్టుల విషయంలో ప్రతి ఒక్కరూ సమానమేనని హైకోర్టు హెచ్చరించింది.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు విశాల్ చెల్లించాల్సిన రూ. 21.29 కోట్ల బకాయి ని తిరిగి చెల్లించే వ్యవహారం ఇప్పుడు చెన్నయ్ హైకోర్టులో సాగుతోంది. ఈ కేసుల విచారణలో భాగంగా తొలుత రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని, విశాల్ తన ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించాలంటూ గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ, ఆయన పట్టించుకోలేదు. అదే సమయంలో గత విచారణకు విశాల్ లేదా ఆయన తరపు న్యాయవాదులు కూడా హాజరుకాలేదు. దీంతో ఈనెల 22వ తేదీ విశాల్ స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. ఇందులో భాగంగా, గత శుక్రవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఆషా కోర్టు ఆదేశం మేరకు ఆస్తుల జాబితాను సమర్పించని విశాల్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అంటూ ప్రశ్నించారు. విశాల్.. కోర్టుల కంటే గొప్ప వ్యక్తిగా తనను తాను ఊహించుకోరాదని, న్యాయస్థానాల విషయంలో ప్రతి ఒక్కరూ సమానమేనని హెచ్చరించారు.
