సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి కృష్ణ జిల్లా ప్రజలను భయకంపితులను చేసిన భారీ వర్షాలు, కృష్ణ నది, బుడమేరు వరదలు నేడు, మంగళవారం తగ్గుముఖం పట్టాయి. దానితో ప్రజలు ఊపిరి తీసుకొన్నారు. గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 11 లక్షల 40 వేల నుంచి గంట గంటకు తగ్గుతూ వరద తాకిడి తగ్గుముఖం పడుతోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 8 లక్షల 94 వేలకు వరద చేరుకుంది. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని బుడమేరు కాస్త శాంతించింది. అయితే మరోవైపు గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పలు గ్రామాలను ఇంకా వరద ముంపు వెంటాడుతోంది. అయితే అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రజలకు తాగునీరు, ఆహారం సరఫరా అందటం లేదని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి వరద బాధిత ప్రజలు కోసం పెద్ద ఎత్తున ఆహారం, మందులు విజయవాడ చేరుకొన్నాయి. వాటి పంపిణి కూడా మొదలయింది. వరద నీరు తగ్గటంతో నేటి ఉదయం నుండి ఇరిగేషన్ అధికారులు నది పరివాహాక ప్రదేశములో బలహీన గట్టులు, డాం గేట్లులు రిపేరు పనులు ప్రారంభించారు.
