సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి ‘వందే భారత్ రైలు’ తీసుకురావడానికి కేంద్రమంత్రి, శ్రీనివాస వర్మ చేసిన కృషి ఫలించింది. నేడు, గురువారం కేంద్ర రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు చెన్నై (ఎంజీఆర్ చెన్నై సెంట్రల్) నుండి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్లు: 20677/20678)ను నర్సాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ నుండి దక్షిణ మధ్య రైల్వేకు (SCR) నేడు, గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సాపురం వరకు పొడిగించిన ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగుతుంది. రైలు నంబర్ 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి నర్సాపురం వరకు, అలాగే రైలు నంబర్ 20678 నర్సాపురం నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు నడవనుంది. ఈ రైలు చెన్నై లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి ( 20677 నెంబర్) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతూ విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20678 నెంబర్ రైలు నర్సాపురం నుండి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:19 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని, 4:09 గంటలకు గుడివాడ చేరుకుని, 4:50 గంటలకు విజయవాడ కు చెన్నైకు రాత్రి 11.45 గంటలకు చేరుకుంటుంది. అధికారిక ప్రారంభ తేదీని రైల్వే శాఖ అతిత్వరలో తెలియజేయనుంది. ఇక చూసుకోండి వేగమే వేగం..
