సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు సైతం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు గాను వచ్చే మూడు నెలలపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. నేడు, శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు కల్పించడానికి సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాన్ని రద్దు చేసినట్లు వివరించారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, బయట లైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, స్నాక్స్, వైద్య సదుపాయాలు నిరంతరం కొనసాగిస్తామని, మాడ వీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు. వేసవి రద్దీ సమయంలో భక్తులకు సహాయం అందించేందుకు స్కౌట్స్, గైడ్స్తో పాటు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించామని తెలిపారు.
