సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. శుక్రవారం భీమవరంలోని ఆయన నివాసం వద్ద రక్షా దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం, పలువురు ఉపాధ్యాయులకు పండ్లు, వస్త్రాలు అందజేసి, శాలువాతో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ, ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. ఒక సమాజం యొక్క భవిష్యత్తును నిర్ణయించేది తరగతి గదులే అని అటువంటి తరగతి గదులకు గుండెకాయ లాంటివారు ఉపాధ్యాయులు అన్నారు. ఉన్నత ఆశయాలతో వృత్తిలో రాబోయే రోజుల్లోనూ కొనసాగాలని ఉపాధ్యాయులను కోరారు.
