సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఏపీలో అసెంబ్లీ , లోక్ సభకు, తెలంగాణాలో కేవలం లోక్ సభకు ఎల్లుండి సోమవారం ఎన్నికలు పోలింగ్ జరుగుతున్నా నేపథ్యంలో .. ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఓటర్లు పయనమవుతున్నారు. ఆంధ్ర ప్రాంతాలకు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణానికి సిద్ధం కావడం గమనార్హం. ఆ క్రమంలో సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే సీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు సైతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. టికెట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు దాదాపు 200 బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ సైతం ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దాదాపు 22 రైళ్లకు అదనపు బోగీల సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే 10వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆయా రైళ్లకు ఈ సౌకర్యం ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ సైతం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతుంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు.. కొన్ని కుల, సామాజిక సంఘాలు పోలింగ్ తేదీ ముందు రోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లకు నాయకులు స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో సదరు ఓటర్ల కోసం.. శని, ఆదివారాల్లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
