సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మార్కెట్ యార్డ్ లో నేడు శనివారం నూతనపాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. మార్కెట్ యార్డుకు నిధులు కొరత లేదని, ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో పనులు జాప్యం అవుతున్నాయని, 20 శాతం నిధులైన తక్షణమే ఖర్చులు చేసి, భీమవరం, వీరవాసరం మండలాలలో పుంత రోడ్లు వెంటనే వేయాలన్నారు. రైతులకు మేలు జరిగేలా మార్కెట్ యార్డ్ కృషి చేయాలని, పాలకవర్గం ఐకమత్యంతో పని చేయాలని అన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కలిదిండి సుజాత, వైస్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ.. సభ్యులందరినీ కలుపుకుని మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తామని, రైతులకు అండగా ఉంటామన్నారు. అనంతరం పుంత రోడ్ల నిర్మాణానికి మార్కెట్ యార్డ్ నూతన సభ్యులు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు. ముందుగా యిర్రింకి సుధ రత్నకుమారి ఎమ్మెల్యే అంజిబాబు సమక్షంలో ఎఎంసి పాలకవర్గ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.
