సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి సమావేశమైన ఖమ్మం సభకు నేడు, బుధవారం గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పాల్గొని రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీపై సీఎం కేసీఆర్ పోరాడుతున్నారని ఆయన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచిగా నిలుస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రెండేళ్లలో వెలుగులు జిలుగుల భారత్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ వస్తే దేశ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని రాష్టాలలో నదీ జలాలతో ప్రజల గొంతు నింపాలని, పొలాలను తడపాలని పేర్కొన్నారు. దీనిని నిజం చేసేందుకే బీఆర్ఎస్ పుట్టిందని, అవసరమైతే మరో ఉద్యమం తప్పదని అన్నారు. దేశంలో ఇంకా నీటి యుద్ధాలు అవసరమా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య కేంద్రం కొట్లాటలు పెడుతోందని విమర్శించారు. దేశంలోని వ్యవస్థలను ప్రైవేటీకరిస్తున్నారని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. ఎల్ఐసీని ప్రవేటీకరణ అవసరమా? బీజేపీ సర్కార్ ప్రైవేటీకరిస్తున్న సంస్థలను వెనక్కి తీసుకుంటామని అన్నారు. విద్యుత్ రంగం ప్రైవేట్ సెక్టార్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘2024 తర్వాత మీరు ఇంటికి.. మేం ఢిల్లీకి’ అనే నినాదాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుతమైన సభని అన్నారు.బీజేపీ, కాంగ్రెస్ దొందుదొందేనని అన్నారు. ఖమ్మం మునిసిపాలిటీకి రూ.50 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మున్నేరుపై కొత్త బ్రిడ్జీని నిర్మిస్తామని ప్రకటించారు. ఇతర మున్సిపాలిటీలకు తలో రూ.30 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
