సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో చాల రాష్ట్రాల తో పొలిస్తే కరోనా కట్టడి సమర్ధవంతంగా ఉన్నఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి వేడుకలకు గత ఏడాదికంటే ఎక్కువ మంది ప్రయాణికులు వస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా 6,970 ప్రత్యేక బస్సులు నడపనున్నామని విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నేటి శుక్రవారం నుండి అంటే ఈ నెల 7 నుంచి 18 వరకు వీటిని నడుపుతామన్నారు. 7 నుంచి 14 వరకు 3,755 సర్వీసులు, 15 నుంచి 18 వరకు మరో 3,215 సర్వీసులను నడుపుతామన్నారు. గతేడాది కంటే 35శాతం అదనపు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రత్యేక సర్వీసు బస్సులన్నీ ఓ వైపు ఖాళీగా వెళ్లి మరోవైపునుంచి ప్రయాణికులతో వస్తాయని, ,కాబట్టి ప్రత్యేక సర్వీసు బస్సులకే ఒకటిన్నర రెట్లు అధిక చార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ 0866–2570005ను అందుబాటులో ఉంచామన్నారు.
