సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 37రోజులుగా జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేడు, ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదని అన్నారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు.ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు- ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం, చంద్రబాబు విషయంలో ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేనపార్టీతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ ఏర్పాటు చేసింది. దానిలో కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ , తంగిరాల సౌమ్య ఉన్నారు.
