సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సచివాలయంలో రాష్ట్రంలో అతి త్వరలో నిర్వహించనున్న సాధారణ ఎన్నికలపై సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి నేడు, గురువారం కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 46వేల 165 పోలింగ్ కేంద్రాలున్నాయి. వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు, తీసుకోవాల్సిన చర్యల ఫై అధికారులతో ఏర్పాట్లను చర్చించారు. సాధారణ ఎన్నికలు పటిష్ట నిర్వహణపై ఇప్పటి నుండే కార్యాచారణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధం ఉన్న వివిధ అధికారుల ఖాళీల భర్తీ చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు అంశాలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో సీఎస్ చర్చించారు. ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నఅధికారులు తప్పనిసరి బదిలీ చేయాలని సీఎస్ తెలిపారు. రానున్నసాధారణ ఎన్నికల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, ఆర్ &బి పంచాయితీరాజ్, విద్యా, మున్సిపల్ తదితర శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.
