సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు మండలం కొవ్వలి గ్రామం లో నేడు గురువారం ఉదయం ప్రారంభమైన అమరావతి రైతుల మహాపాదయాత్ర లో టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు , బిజెపి నేత, తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి పాల్గొన్నారు. మహిళలు అక్కడ రధం ముందు శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేసారు. అమరావతి రైతులను, పాదయాత్రగా వచ్చిన మహిళలను కలిసిన గారపాటి చౌదరి, ఒక రైతు బిడ్డగా తాను అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నానని తన మద్దతు అమరావతి రైతులకు ఉంటుందని అన్నారు. నేటి సాయంత్రానికి అమరావతి రైతుల పాదయాత్ర శ్రీరామవరం చేరుకుంది. అయితే శ్రీరామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ సర్పంచ్ కామిరెడ్డి నాని ఇంటి వద్ద చేరిన టీడీపీ శ్రేణులు జై అమరావతి.. జై చింతమనేని ప్రభాకర్ ..సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినదించడంతో, క్షణాలలో అక్కడికి చేరుకొన్నభారీ సంఖ్యలో వైసీపీ జెండాలు చేతబూని వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా మూడు రాజధానులే ముద్దు, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పారు దాంతో వివాదం సద్దుమణిగింది.
