సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం ద్వారా జారీ చేసే పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించాలని నిర్ణయించడం సముచితం కాదని నరసాపురం ఎంపీ. రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. నేడు, మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ… ఆస్తి హక్కు పత్రం అనేది భూ యజమాని భద్రంగా దాచుకునేదని, దానిపై ముఖ్యమంత్రి ఫోటో తో పాటు, సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రుల ఫోటోలను కూడా ముద్రించాలని అనుకుంటున్నారట.. ఇదెక్కడి అరాచకం, ఆటవికం అంటూ మండిపడ్డారు. మా ఆస్తి హక్కు పత్రాలపై మీ బొమ్మ ఏంటని ప్రజలంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై కూడా తాను నిపుణులతో చర్చిస్తున్నానని తెలిపారు.ఈ పథకం ఇప్పటికే మధ్యప్రదేశ్ లో అమలు చేస్తున్నారని, అయితే ఇంటి యాజమాన్య హక్కులను కల్పించే పట్టా మీద మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల ఫోటోలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండేది 2024 ఏప్రిల్ వరకేనని ఎంపీ రఘురామకృష్ణం రాజు జోస్యం చెప్పారు
