సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు, శనివారం భీమవరం మండలం నాగిడి పాలెం పంచాయితీ పరిధిలోని రెడ్డి చెరువులో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గడపగడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా గ్రామంలో ఓ హెచ్ ఆర్ ట్యాంక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి జలజీవన్ మిషన్ పథకంలో రూ 21 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా భీమవరం మండలానికి సంబంధించి రూ 11 కోట్ల నిధులను మంజూరు చేయగా, ఒక్క నాగిడి పాలెం గ్రామానికి 97 లక్షల నిధులను త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేయనున్నామని అన్నారు. నవరత్న పథకాలలో ఒక్కో కుటుంబానికి లక్ష నుండి ఆరు లక్షల వరకు కూడా లబ్ధి పొందిన ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి కాదని అన్నారు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు, అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కి మాత్రమే దక్కిందని అన్నారు. జల జీవన్ మిషన్ పథకంలో పైపులైన్ పనులు దిరుసుమర్రు గ్రామం నుండి ప్రారంభమయ్యాయని అన్నారు .అనంతరం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇంటి స్థలం, గృహ నిర్మాణం, పెన్షన్, తదితర పథకాలను ప్రజలు అడుగుతున్నారని, అటువంటి వారి జాబితాను తయారుచేసి వెంటనే ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువు తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. అదే మాదిరిగా లింకు రోడ్లను ఎక్కడైనా నిర్మించాల్సి ఉంటే వాటికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
