సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోనూ ప్రపంచంలోను ఎక్కడైనా సరే భీమవరం వాసులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాగే ఇటీవల కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన 2వ సారి ఎమ్మెల్యే గా గెలచి కర్ణాటక లోని సీఎం సిద్దరామయ్య కేబినేట్లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు.. భీమవరంకు 8 కిమీ దూరంలోని మోగల్లు వాసి.. నడింపల్లి బోస్ రాజు. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు, అణు శాస్త్రవేత్త ఏఎస్ రావులతో ఇప్పటికే మోగల్లుకు చరిత్రలో ఒక గుర్తింపు వచ్చింది. 74 ఏళ్ల వయసున్న బోస్ రాజు ఇక్కడే పుట్టి పెరిగారు. పాలకోడేరు గ్రామంలో ఎస్ఎస్ఎల్సీ పాసయ్యారు. యువకుడుగా భీమవరం లో హల్చల్ చేసారు. 1967లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లమో చేశారు. తర్వాత కర్నాటకలోని మాన్వీలో స్థిరపడ్డారు. అక్కడే ఎరువుల వ్యాపారం చేస్తూ 1969లో యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి సంపాదించారు. కర్ణాటక ముఖ్యమంత్రులుగా ఎస్.బంగారప్ప, వీరప్ప మొయిలీ కేబినెట్లలో కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం చిన్న తరహా నీటిపారుదల, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో వైపు ఆయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం కోటా కింద బోస్ రాజుకు మంత్రి పదవి ఇచ్చారు.
