సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఐడీ అధికారులు ఫైబర్ గ్రిడ్ కేసు లో సంచలన నిర్ణయం తీసుకొన్నారు. కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని భావిస్తున్న ఈ కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్మెంట్ చేయడానికి నిర్ణయించారు. ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ అధికారుల ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఏసీబీ కోర్టు సాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు డైరెక్టర్గా ఉన్న నెప్టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్కు చెందిన విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లోని ఓ ఫ్లాట్, టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్ కాలనీలో ఉన్న మరో ఫ్లాట్.. అలాగే ఈ కేసులో నిందితుడు తుమ్మల గోపీచంద్ పేరిట హైదరాబాద్ యూసఫ్గూడలో ఉన్న ఫ్లాట్, గోపీచంద్ భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో వ్యవసాయ భూమి ఉంది. వారి స్థిరాస్తులను అటాచ్ చేయడానికి రాష్ట్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.
