సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రముఖ ఫుడ్ కోర్ట్ ‘ఈట్ స్ట్రీట్’ వద్ద గత రాత్రి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సామాన్య ప్రజల మధ్య కూర్చుని ఆయన అల్పాహారం స్వీకరించి, టీ తాగారు. కేంద్రమంత్రి తమ మధ్యకు రావడం తోపాటు తమతో మమేకమై మాట్లాడటంతో స్థానికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. నిన్న బిజెపి ఆధ్వర్యంలో జరిగిన పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగించుకుని తిరిగి భీమవరం వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో తాడేపల్లిగూడెంలో కొద్దిసేపు ఆగారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, సీనియర్ బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ తదితర నాయకులు, ఉన్నారు.
