సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని గొల్లలకోడేరు లోని జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయంలో నేడు, గురువారం పదకొండవ విడత సెల్ ఫోన్ల రికవరీ కార్యక్రమంలో భాగంగా సుమారు ₹18,90,000/- రూపాయల విలువగల 126 దొంగిలించబడిన లేదా చేజార్చుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి సంబంధిత యజమానులకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్.,స్వయంగా అందజేశారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు విడతల వారిగా సుమారు 2 కోట్ల 60 లక్షల రూపాయల విలువగల మొత్తం 1738 సెల్ ఫోన్లు రికవరీ చేసి పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు వినియోగదారులకు అందించారని అన్నారు. ఎవరు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న తక్షణమే “9154966503” వాట్సాప్ నంబర్కు “Hi” లేదా “Help” అని మెసేజ్ చేసి, వచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో మొబైల్ వివరాలు నింపితే చాలు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను రికవరీ చేసి మీకు అందిస్తాం అని భరోసా ఇచ్చారు. అలాగే ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా బిల్లులు లేని సెల్ ఫోన్ లను కొనడం కాని చేయకూడదని, తద్వారా కేసులలో చిక్కుకోవాల్సి వస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ ట్రాకింగ్ బృంద సభ్యులగు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి అహ్మదున్నిషా మరియు వారి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు , జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్, డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
