సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూ ఢిల్లీలో నేడు, గురువారం ప్రధాని మోదీ రాష్ట్రీయ రోజ్ గార్ మేళాలో వర్చువల్ సమావేశంలో పాల్గొని 71వేలమంది అభ్యర్థులకు అప్పాయింట్ మెంట్ లెటర్లను అందజేశారు. రాష్ట్రీయ రోజ్ గార్ మేళా యువతకు ఉద్యోగాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని మోదీ అన్నారు. తన హయాంలో దేశంలో స్టార్టప్ కంపెనీలు 40 లక్షల ఉద్యోగాలు కల్పించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రక్షణ శాఖకు కావాల్సిన 300 పరికరాలను మన దేశం ఉత్పత్తి చేస్తుందని ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి ఆయుష్ సర్బానంద సోనోవాల్ గువహటిలోని రైల్ రంగ్ భవన్ కల్చరల్ హాలులో కొత్త అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కం టికెట్ క్లర్కు, ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుళ్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు, పోస్టల్ అసిస్టెంట్లు, ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్లు, ఉపాధ్యాయులు, లైబ్రేరియన్ లు, నర్సుల ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను ప్రదానం చేశారు.రోజ్గార్ మేళా డ్రైవ్లో భాగంగా 2024లో వచ్చే లోక్సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
